దేశమంతా భారత రాజ్యాంగం.. ఏపీలో మాత్రం భారతి రాజ్యాంగం: బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి

  • జమ్మలమడుగులో జగన్ పోటీ చేస్తే ప్రత్యర్థిగా బరిలోకి దిగుతా
  • జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది
  • వివేకా హత్యకేసులో నన్ను ఇరికించాలని ప్రయత్నించారు
  • జమ్మలమడుగులో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మల్లెల శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిన్న వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో యువ సంఘర్షణ యాత్ర నిర్వహించారు. వందలాదిమంది బీజేపీ కార్యకర్తలు దానవులపాడు నుంచి పాత బస్టాండ్‌లోని గాంధీ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని 15 స్థానాలకే పరిమితం చేస్తామన్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలో నిండా అప్పుల్లో మునిగిపోయిందన్నారు.

దేశమంతా భారత రాజ్యాంగం నడుస్తుంటే ఏపీలో మాత్రం భారతి రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేకున్నా ఇరికించేందుకు ప్రయత్నించడం ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ కనుక జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తే తాను ప్రత్యర్థిగా బరిలోకి దిగుతానని, అందుకే ఇక్కడికొచ్చానని అన్నారు. మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన ఉక్కు పరిశ్రమ సంగతేమైందని ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు.

YS Jagan
Adinarayana Reddy
Jammalamadugu
BJP

More Telugu News